సాధారణంగా కొందరికి మూగజీవాలు అంటే ఎంతో ఇష్టం, ప్రేమ ఉంటాయి. ఈ క్రమంలోనే వాటి కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఆ పెంపుడు జంతువులు కూడా యజమాని పట్ల అంతే ప్రేమ, విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఇలా ఎంతో అపురూపంగా చూసుకునే జంతువులకు ఏ చిన్నపాటి గాయమైనా తల్లడిల్లిపోతుంటారు. అలాగే వీటిపై ఉన్న ప్రేమతో కొందరు ఎక్కడికి ప్రయాణించినా వారితోపాటు ఈ పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్లడం మనం చూస్తూ ఉంటాము.
తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి విమానంలో ప్రయాణించాలని భావించాడు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్క కోసం విమానంలో ఉన్న బిజినెస్ కేబిన్ మొత్తం బుక్ చేసుకొని తన పెంపుడు కుక్కతో కలిసి ముంబై నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ లో ప్రయాణం చేశాడు. ఇలా తన కుక్క తో కలిసి ప్రయాణం చేసినందుకు ఆ యజమాని ఏకంగా 2.50 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు.
ఎయిర్ ఇండియా విమానం AI-671లో టికెట్స్ బుక్ చేశాడు. ఈ విమానంలో బిజినెస్ క్లాస్ లో 12 సీట్లు ఉంటాయి. అయితే తనకెంతో ఇష్టమైన పెంపుడు కుక్కకు ఎంతో సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో సదరు యజమాని ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసి ముంబై నుంచి చెన్నై కి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.