Gold : కర్ణాటక రాష్ట్రంలో వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు బంగారు చెయిన్ ను మింగేసింది. దీంతో దాన్ని సర్జరీ చేసి తీసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా సిర్సి తాలూకా హీపనహల్లి అనే ప్రాంతంలో ఉంటున్న శ్రీకాంత్ హెగ్డె అనే కుటుంబానికి నాలుగేళ్ల వయస్సు ఉన్న ఓ ఆవు, దానికి దూడ ఉన్నాయి.
కాగా ఇటీవల దీపావళి సందర్భంగా ఇంట్లో ఆవులకు గోపూజ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆవులకు పూలమాలలు, బంగారు ఆభరణాలను వేసి పూజలు చేశారు. పూజల అనంతరం వాటిని తీసేశారు. అయితే ఓ ఆవు దూడ మెడకు 20 గ్రాముల బంగారు చెయిన్ను వేశారు. అది పూలమాలలో కలిసిపోయి ఉంది. దీంతో ఆ దూడ దాన్ని తినేసింది. ఆ చెయిన్ కాస్తా దాని పొట్టలోకి వెళ్లిపోయింది.
అయితే పూజలో ఉపయోగించిన చెయిన్ కనిపించడం లేదని ఆ కుటుంబ చెయిన్ కోసం ఎంతగానో వెదికింది. అయినప్పటికీ ఫలితం లేదు. అలా వారు నెల రోజులుగా ఆవుల షెడ్లు, వాటి పేడలో చెక్ చేస్తూ వచ్చారు. చివరకు వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షించి చూడగా దాని పొట్టలో చెయిన్ ఉన్నట్లు తేలింది.
ఈ క్రమంలోనే డాక్టర్ ఆ ఆవుకు సర్జరీ చేసి చెయిన్ను బయటకు తీశారు. అయితే 20 గ్రాములు ఉండాల్సిన ఆ చెయిన్ కాస్తా 18 గ్రాముల బరువు తూగింది. మిగిలిన రెండు గ్రాములు ఆవు పొట్టలోని యాసిడ్ల వల్ల కరిగిపోయిందని తేలింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఆ చెయిన్ పూర్తిగా కరిగిపోయి ఉండేదన్నమాట. అయితే ఆ ఆవు ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.