Samantha : అక్కినేని నాగ చైతన్య- సమంతలు ఎంతో చూడ ముచ్చటగా ఉండే వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిండు నూరేళ్లు కలిసి జీవిస్తారని అందరు భావించగా, వారు అందరి ఆశలను అడియాశలు చేశారు. అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు వీరు తీసుకున్న నిర్ణయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. చై-సామ్ విడిపోయిన తర్వాత సోషల్ మీడియా ద్వారా స్పందించిన నాగ చైతన్య తండ్రి నాగార్జున చాలా ఎమోషనల్ అయ్యారు.
ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సామ్, చైలు విడిపోవటం నిజంగా దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె మా కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.. అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు నాగ్.
ఇక సమంత తండ్రి జోసెఫ్ ప్రభు స్పందిస్తూ.. ఈ విషయం తెలిసినపట్టి నుంచి తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని అన్నారు. సమంత అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని తాను భావిస్తున్నానని, త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని జోసెఫ్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా.. విడాకుల సమయంలో చైతూ- సామ్ ఒకే పోస్ట్ పెట్టి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని తెలియజేశారు. మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది. ఇకపై కూడా ఆ స్నేహబంధం అలాగే కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం.. మేం మా జీవితాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రైవసీని మాకు ఇవ్వండి అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.