Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈనెల 10వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ నువ్వా నేనా అంటూ మాటలయుద్దం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 60 మందితో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తనకు అనుకూలంగా వేయించుకుంటున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తూ ఎన్నికల అధికారికి తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు.
కాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు మరోసారి ఘాటుగా స్పందించారు. బ్యాలెట్ కాకున్నా ఈవీఎం పెట్టినా కూడా ప్రకాష్ రాజ్ ఇదేవిధంగా ఆరోపిస్తారని, విష్ణు వెల్లడించారు. ప్రకాష్ రాజ్ అనవసరంగా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారని.. తన ఫ్యామిలీ గురించి విమర్శించే హక్కు ప్రకాష్ రాజ్ కి లేదని తెలిపారు. ఇక ప్రకాష్ గతంలో రియల్ స్టార్ శ్రీహరితో కలిసి నాన్న దగ్గరికి వచ్చి అన్నయ్యా.. అంటూ నాన్న కాళ్లు పట్టుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రస్తుతం శ్రీహరి మన మధ్యలో లేరు, ఆయనే కనుక ఉండుంటే మీకు సరైన గుణపాఠం చెప్పేవారని, మా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ ఈ విధమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనప్పటికీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పవచ్చు.