ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలు భారీగా నగదును తమ వద్ద పెట్టుకున్నారు. బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసేందుకు వెనుకాడారు. తరువాత రూ.2000 నోటును రద్దు చేస్తారని అడపా దడపా వార్తలు వచ్చాయి. దీంతో అప్పుడప్పుడు ప్రజలు ఆ నోట్లను మార్చుకుని ఇతర నోట్లను భారీగా తమ వద్ద పెట్టుకున్నారు. అయితే దేశంలో రోజు రోజుకీ కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ లాక్డౌన్ పెడతారోనని ప్రజలు భయాందోళనలు చెందుతూ పెద్ద ఎత్తున నగదును బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది.
కరోనా లాక్డౌన్ సమయంలో గతేడాది ప్రజలు భారీగా నగదును విత్ డ్రా చేశారు. చేతిలో డబ్బు ఉండాలని చెప్పి చాలా మంది డబ్బును విత్డ్రా చేస్తున్నారు. ప్రస్తుతం అనేక హాస్పిటల్స్లో డెబిట్, క్రెడిట్, యూపీఐ ల ద్వారా కాకుండా నగదును మాత్రమే పేమెంట్ రూపంలో తీసుకుంటున్నారు. అందువల్ల కూడా ప్రజలు పెద్ద ఎత్తున డబ్బును విత్ డ్రా చేస్తున్నారు.
ఇక గత 15 రోజుల్లోనే దేశంలోని ప్రజలు భారీగా నగదును విత్డ్రా చేశారని వెల్లడైంది. అంతకు ముందు 15 రోజులతో పోలిస్తే ఏప్రిల్ 9వ తేదీ నాటికి ప్రజల వద్ద ఉన్న డబ్బులో రూ.30,191 కోట్ల వరకు పెరిగిందని తేలింది. ప్రస్తుతం ప్రజల వద్ద రూ.27.87 లక్షల కోట్ల రూపాయల నగదు ఉందని వెల్లడైంది. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 9వ తేదీ మధ్య గతంలో కన్నా రూ.52,928 కోట్ల నగదు పెరిగిందని ఆర్బీఐ తెలిపింది.
దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు నగదును భారీగా విత్ డ్రా చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ విధిస్తే ఇబ్బందులు వస్తాయని, కనుక ముందు జాగ్రత్తగా డబ్బులు విత్డ్రా చేసి పెట్టుకుంటే మంచిదని ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకనే నగదు విత్డ్రాలు పెరిగినట్లు చెబుతున్నారు.