ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలను ప్రజలు వైకాపాకు కట్టబెట్టారు. దీంతో జగన్ సీఎం అయ్యారు. అంతేకాదు, ఆయన పాదయాత్రలో, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కూడా పూర్తి చేస్తున్నారు. దీంతో ఏ ఎన్నికల్లో అయినా సరే వైకాపా విజయ దుందుభి మోగిస్తూనే వస్తోంది. ఇక ఇటీవల తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం విదితమే. కాగా ఆ ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో వైసీపీ తన సీటును మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని ఎగ్జిట్స్ పోల్స్ తేల్చి చెప్పాయి.
తిరుపతి లోక్సభ సిట్టింగ్ స్థానాన్ని వైకాపా మళ్లీ సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ క్రమంలోనే ఆరా ఎగ్జిట్ పోల్స్లో వైకాపాకు 65.85 శాతం, టీడీపీకి 23.10 శాతం, బీజేపీకి 7.34 శాతం ఓట్లు వస్తాయని తెలిపారు. అయితే తుది ఫలితాలకు 2 నుంచి 3 శాతం వరకు తేడా ఉండేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక ఆత్మ సాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా వైకాపాకే సీటు వస్తుందని వెల్లడైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైకాపాకు 59.25 శాతం, టీడీపీకి 31.25 శాతం, బీజేపీకి 7.5 శాతం వరకు ఓట్లు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఉప ఎన్నిక ఫలితాలు మే 2వ తేదీన వెలువడుతాయి కనుక అప్పటి వరకు వేచి చూడాల్సిందే.