ఎవరూ లేని అనాథ అతను. నిన్న మొన్నటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేవాడు. వారు కాస్తా దూరం కావడంతో అతని పరిస్థితి కడు దయనీయంగా మారింది. మానసిక వ్యాధి గ్రస్తుడు కావడంతో అతను ఎక్కడ హాని చేస్తాడేమోనని గ్రామస్థులు అతన్ని గొలుసులతో కట్టేసి విడిచి పెట్టారు. దీంతో అతన్ని పట్టించుకునే వారు లేక అత్యంత దీనావస్థలో అతను జీవితాన్ని గడుపుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలో బధ్రాజి అనే గ్రామం ఉంది. అక్కడ 40 ఏళ్ల రాజారాం చక్రవర్తి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని తల్లి 3 నెలల కిందట చనిపోగా తండ్రి చనిపోయి 1 నెల అయింది. అయితే అతను మానసిక వ్యాధిగ్రస్తుడు. ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేవాడు. కానీ వారు చనిపోయాక రాజారాం పరిస్థితి దయనీయంగా మారింది.
అతను మానసిక వ్యాధిగ్రస్తుడు కావడంతో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. గ్రామంలో తిరుగుతూ రాళ్లను తీసుకుని కిటికీల అద్దాలు, వాహనాలను బద్దలు కొట్టేవాడు. దీంతో గ్రామస్థులు గొలుసులు, తాళ్లతో అతని కాళ్లు, చేతులను కట్టేసి విడిచిపెట్టారు.
Madhya Pradesh: A mentally challenged man roams around Badhraji village, 40 km from Jabalpur city. His hands and feet are roped together. Nobody knows who has tied up his legs and hands and for how long he has been roaming around the village. pic.twitter.com/cKlYMvO3dV
— Free Press Journal (@fpjindia) July 29, 2021
అయితే అతను అలా బంధించబడి గ్రామంలో తిరుగుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఆ గ్రామ పంచాయతీ అధికారులను మీడియా ప్రశ్నించింది. అతనికి మానసిక వ్యాధి గ్రస్తుల కోటా నుంచి నెల నెలా ప్రభుత్వ సహాయం అందుతోంది. కానీ అతన్ని హాస్పిటల్లో చేర్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. అయితే మీడియా ఈ విషయాన్ని వారి దృష్టికి తేగానే తాము తప్పు చేశామని అంగీకరించారు. వెంటనే అతన్ని ప్రభుత్వ మానసిక హాస్పిటల్లో చేరుస్తామని చెప్పారు.