హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గా దేవికి ప్రత్యేక అలంకరణలు చేసి వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ క్రమంలోనే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చాలా మంది భక్తులు ఉపవాసాలతో అమ్మవారికి పూజించడం మనం చూస్తూ ఉంటాము.
అయితే నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే వారు ఈ తొమ్మిది రోజుల పాటు ఏ విధమైనటువంటి నియమ నిష్టలతో అమ్మవారిని పూజించాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నవరాత్రి ఉత్సవాలు జరుపుకొనేవారు నిత్యం స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి పూజగదిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకొని నిత్యం పూజలు చేయాలి. నవరాత్రులలో భాగంగా మొదటి రోజు అమ్మవారిని పూజించేవారు కలశ స్థాపన చేసే సమయంలో సరైన ముహూర్తంలో ఏర్పాటు చేసి అమ్మవారిని పూజించాలి. అదే విధంగా పూజ చేస్తున్నంత సేపు మనసు అమ్మవారిపై ఉంచి పూజించిన అనంతరం అమ్మవారి శ్లోకాలు, మంత్రాలు చదవాలి. ఇక ఉపవాసం ఉన్నవారు కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మద్యం, మాంసం ముట్టుకోకూడదు. కలశం ముందు ఏర్పాటుచేసిన అఖండ దీపం కొండెక్కకుండా నిత్యం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మగవారు నవరాత్రులలో గుండు చేయించుకోకూడదు. ఆడవాళ్లు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. నవరాత్రి పూజ చేసేవారు ఇతరులపై కోపం లేకుండా శాంతియుతంగా ఉండాలి.