ఆడలేక మద్దెల ఓడిందనే సామెత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందా..? అంటే.. అందుకు విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఏపీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఎస్ఈసీగా చంద్రబాబు మనిషే ఉన్నారు. అయినా ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. తరువాత ఇప్పుడు కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని వచ్చారు. అయితే అప్పుడు, ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏమీ మారలేదు. అలాగే ఉంది. కానీ అన్ని ఎన్నికల్లోనూ ఓడుతూ వస్తున్నాం కదా, ఇంకా ప్రతిష్టను దిగజార్చుకుని, అవమానపడడం ఎందుకు అనుకున్నారో, ఏమో కానీ.. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు తాజాగా చెప్పారు.
అంటే.. మేం బాగానే ఉన్నాం, మా పార్టీ పరిస్థితి కూడా బాగానే ఉంది, కానీ ఎస్ఈసీ, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్లే మేం పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, లేదంటే ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం.. అన్నట్లు ఉంది బాబు తీరు. ఇప్పటికే పాతాళానికి పడిపోయిన పార్టీ పరువును ఇంకా పోగొట్టుకోవడం ఎందుకని చెప్పే బాబు ఆ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. కానీ పైకి మాత్రం ప్రభుత్వం, ఎస్ఈసీలను సాకుగా చూపుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
తమకు అనుకూలంగా ఉన్న నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉన్నప్పుడు ఆయన పనితీరు భేష్ అని మెచ్చుకున్నారు. ఎన్నికలు పెట్టాల్సిందేనన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కనుకనే ఎన్నికలను వద్దనుకుండా తామే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం నిజంగా బాబుకే చెల్లిందని పలువురు అంటున్నారు.
– విశ్వ