హిందువులకు ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో మహిళలు పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రావణమాసంలో వచ్చే మంగళవారం, శుక్రవారాలలో అమ్మవారికి వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మంగళవారాలలో మంగళగౌరీ వ్రతం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. మంగళగౌరీ వ్రతం అనగా సాక్షాత్తు ఆ పార్వతీదేవికి పూజ చేయడమే.ఈ విధంగా పార్వతీదేవికి పూజ చేయడం వల్ల మహిళలు తమ మాంగల్య బలం పది కాలాలపాటు చల్లగా ఉంటుందని విశ్వసిస్తారు. మరి ఈ పూజ ఎలా చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణ మంగళవారాలలో చేస్తారు. ఈ వ్రతం చేసే వారు ఉపవాస దీక్షలతో వ్రతం ఆచరించాలి. కొత్తగా పెళ్లయిన వధువు చేత ఈ వ్రతం ఆచరించడం వల్ల తన వైవాహిక జీవితం పది కాలాలపాటు చల్లగా ఉంటుందని భావిస్తారు.ఈ క్రమంలోనే నూతన వధువు చేత మంగళ గౌరీ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా పుట్టింటిలో నిర్వహించాలి. మిగిలిన నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లో ఈ వ్రతం చేయాలి.
ఈ వ్రతం చేసేటప్పుడు వ్రతం చేసే వారి తల్లి తన పక్కనే ఉండి తన కూతురు వ్రతం చేయించాలి. ఒకవేళ తల్లి లేని పక్షంలో అత్త కూర్చోవాలి. ఈ విధంగా పూజ అనంతరం మొదటి వాయనం తల్లికి సమర్పించడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. అలాగే ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి మంగళప్రదమైన వస్తువులను తాంబూలంలో పెట్టి వాయనంగా ఇవ్వడం వల్ల తను దీర్ఘసుమంగళీగా ఉంటుందని భావిస్తారు. ఈ విధంగా నెల మొత్తం ఒకే విగ్రహాన్ని పెట్టి పూజ చేయాలి.ఈ విగ్రహాన్ని వినాయక చవితి తరువాత వినాయకుడికి నిమజ్జనం చేసేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని కూడా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.