ఎన్నో ఆశలతో వివాహ బంధం ద్వారా కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించాలని ఎన్నో కలలు కన్న ఆ వధువు కలలు ఆవిరైపోయాయి. పెళ్లయిన మూడు నెలలకే ఆ వధువు తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు కడుపుకోతగా మిగిల్చింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాకు చెందిన పీనాబాయి జుక్కల్ మండలం దోస్త్పల్లి తండాకు చెందిన వీరేశంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో నవవధువు అత్తారింట్లో అడుగుపెట్టింది.తన కూతురి జీవితం సంతోషంగా సాగిపోతుందనుకున్న క్రమంలో నవవధువు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించిన వార్త తెలియగానే ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పీనాబాయి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తన కూతురుది ఆత్మహత్య కాదని,తను ఆత్మహత్య చేసుకోలేదని అదనపు కట్నం కోసం అత్తింటివారు తనని హత్య చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పీనాబాయి అత్తింటి వారి పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.