ఓలా సంస్థ తాజాగా రెండు నూతన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్లో విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా ఈ స్కూటర్లకు గాను ఓలా ప్రిబుకింగ్స్ ను నిర్వహిస్తోంది. రూ.499తో వీటిని బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కూటర్లకు గాను 1 లక్షకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు ఓలా తెలియజేసింది.
ఎస్1, ఎస్1 ప్రొ పేరిట ఓలా విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.99,999 ఉండగా, ఎస్1 ప్రొ ధర రూ.1,29,999 గా ఉంది. వీటిని సౌకర్యవంతమైన ఈఎంఐ ప్లాన్లలోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. కనీసం నెలకు రూ.2,999 చెల్లిస్తే చాలు, వీటిని సొంతం చేసుకోవచ్చు.
ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి పెద్ద మొత్తంలో సబ్సిడీని అందిస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్లో ఈ రెండు స్కూటర్లను చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఇవి అక్కడ వరుసగా రూ.79,999, రూ.1,09,999 ధరలకు లభిస్తున్నాయి. ఢిల్లీలో వీటి ధరలు రూ.85,099, రూ.1,10,499 ఉండగా, మహారాష్ట్రలో రూ.94,999, రూ.1,24,999గా ఉన్నాయి. అలాగే రాజస్థాన్లో రూ.89,968, రూ.1,19,138, ఇతర రాష్ట్రాల్లో వీటి ధరలు వరుసగా రూ.99,999, రూ.1,29,999గా ఉన్నాయి.
ఈ స్కూటర్లు 8.5 kW పవర్ను అందిస్తాయి. కేవలం 3 సెకన్లలోనే 0-40 kmph స్పీడ్ కు వెళ్లవచ్చు. 5 సెకన్లలో 0 నుంచి 60 kmph చేరుకుంటాయి. గంటకు గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో వీటిపై వెళ్లవచ్చు. వీటిల్లో నార్మల్, స్పోర్ట్, హైపర్ మోడ్స్ ను అందిస్తున్నారు.