ప్రపంచ వ్యాప్తంగా హిందువులు జరుపుకొనే ఎన్నో ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితి రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఈ విధంగా వినాయక చవితి రోజు స్వామివారిని పూజించడం వల్ల మనకు కలిగే విఘ్నాలు తొలగిపోయి అన్నీ శుభాలు కలుగుతాయని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే స్వామివారి కరుణాకటాక్షాల కోసం వినాయక చవితి రోజు పెద్ద ఎత్తున స్వామి వారికి ఉపవాస దీక్షలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
వినాయక చవితి రోజు ముఖ్యంగా నైవేద్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వినాయకుడి పూజలో నైవేద్యాలను సమర్పించడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు. ముఖ్యంగా స్వామివారి నైవేద్యంలో తప్పనిసరిగా బెల్లంతో చేసిన పిండివంటలు ఉండాలి. ఈ క్రమంలోనే చాలామంది బెల్లంతో చేసిన పూర్ణాలు, కుడుములను తప్పనిసరిగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
కుడుములు, పూర్ణాలే కాకుండా స్వామివారికి శనగ పిండి బూందీ లడ్డూలనూ, పంచామృతం, బొబ్బట్లు, కేసరి, పులిహోర వంటి ఆహార పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధమైన నైవేద్యాలను సమర్పించి పూజ చేయటం వల్ల గణపయ్య ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. అయితే తప్పనిసరిగా నైవేద్యాలను సమర్పించాలనే నియమం కూడా లేదు. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. భక్తి శ్రద్ధలతో కేవలం ఒక బెల్లపు ముక్కను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూజించడం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా తన భక్తులపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.