అభం శుభం తెలియని ఆ చిన్నారి పట్ల దేవుడు ఎంతో చిన్న చూపు చూశాడు. బోసినవ్వులతో, ముద్దు ముద్దుగా ఉన్న ఆ చిన్నారిపై కాలనాగు పగబట్టి మరీ ఆ బిడ్డను కానరాని లోకాలకు తీసుకు వెళ్ళింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా తన బిడ్డపై పాము దాడి చేయడం చూసిన తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ముంపు గ్రామం లక్ష్మణాపురంలో నివసిస్తున్న బాణావత్ గణేశ్-దివ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం ఉన్నారు. ఈ క్రమంలోనే దివ్య తన పది నెలల కుమారుడు భవిత్ను ఎత్తుకొని ఇంట్లో ఆడిస్తోంది. కాగా కిటికీ దగ్గర ఉన్న బొమ్మలను తన కుమారుడికి ఇవ్వడం కోసం అతన్ని ఎత్తుకొని కిటికీ వద్దకు వెళ్ళింది.
అయితే వారి ఇంటి గోడలకు లోపలి భాగంలో సిమెంట్ ప్లాస్టింగ్ చేయకపోవటం వల్ల ముందుగానే పాము ఇటుకల మధ్యలో చేరుకొని ఉంది. ఈ విధంగా తన కొడుకును అక్కడికి తీసుకొని వెళ్ళిన దివ్య బొమ్మల కోసం చూస్తుండగా.. ఇటుకల మధ్యలో నుంచి పాము బాలుడి కాలిపై కాటు వేసింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన తన కొడుకుని చూసిన తల్లి ఏమైందని చూడగా ఆ పాము మరొకసారి కాటు వేసింది. ఇది చూసి బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందాడు. ఎంతో ముద్దు ముద్దుగా ఇంట్లో ఎంతో సందడిగా ఉండే తన పసి బిడ్డ మరణించడంతో ఆ తల్లి రోదన వర్ణనాతీతంగా మారింది.