తనతోపాటు బైక్ పై రాలేదని ఓ భర్త కోపంతో తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఇరికేపల్లి జంగాల కాలనీలో చోటుచేసుకుంది. కేవలం ద్విచక్ర వాహనంపై తన భర్తతో పాటు కలిసిరానని చెప్పినందుకు ఆవేశంతో అతను తన భార్యపై కత్తితో దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సుధాకర్ అనే వ్యక్తి తన భార్య భవాని, పిల్లలతో కలిసి మాచర్లలో జరిగిన వివాహ కార్యక్రమానికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. ఈ క్రమంలోనే తిరిగి వస్తున్న సమయంలో తన భార్య ద్విచక్రవాహనంపై రానని అభ్యంతరం తెలిపింది. తన భర్త సుధాకర్ అతివేగంతో వాహనాన్ని నడపడం కారణంగా ఆమె అతనితో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్లడానికి అభ్యంతరం తెలిపింది. తరువాత ఆమె బస్సులో ఇంటికి చేరుకుంది. అయితే తనతోపాటు బైక్పై రావడానికి నిరాకరించిందనే కోపంతో ఇంటికి వచ్చిన భార్యతో సుధాకర్ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి సుధాకర్ ఆవేశంతో పక్కనే ఉన్న కత్తి తీసుకుని భవాని గొంతు కోసి పరారయ్యాడు.
ఈ క్రమంలోనే భవానిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆమె గొంతుకు పదహారు కుట్లు పడ్డాయి. దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు .