ప్రమాదం ఎప్పుడు ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా రహదారులు, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలలో కొద్దిగా ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించిన ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి. అచ్చం ఈ తరహాలోనే ఓ చిన్నారి రైల్వే ప్లాట్ ఫామ్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నఫలంగా రైల్వే పట్టాలపై పడ్డాడు.దీంతో అక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగి సకాలంలో స్పందించి ప్రాణాలకు తెగించి మరీ ఆ చిన్నారి ప్రాణాలు కాపాడిన ఘటన ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.
ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్ఫాం వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా చిన్నారి రైల్వే పట్టాలపై పడిపోయింది. తనతోపాటు ఉన్న వ్యక్తికి ఏం చేయాలో తోచక గట్టిగా కేకలు వేస్తున్నాడు. అంతలోనే అటువైపుగా రైలు అధిక వేగంతో దూసుకొస్తోంది. ఇది గమనించిన మయూర్ షెల్ఖే అనే రైల్వే ఉద్యోగి పట్టాలపై పరుగులు పెడుతూ ఆ చిన్నారి ప్రాణాలను నిమిషాల వ్యవధిలో కాపాడాడు.
మయూర్ షెల్ఖే అనే రైల్వే ఉద్యోగి రైలుకు ఎదురుగా వెళ్లి చిన్నారిని పట్టాలపై నుంచి ఫ్లాట్ ఫామ్ మీదకు వేసి తను కూడా సెకండ్ల వ్యవధిలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ లో రికార్డ్ కావడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోపాటు నెటిజన్లు మయూర్ షెల్ఖే చేసిన ధైర్య సాహసానికి ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.