ప్రధానమంత్రి నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేద మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను పొందారు. ఈ పథకం మొదటి దశ విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల 2.0 పథకం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిరుపేద మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకుని ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ఐదు కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే రెండవ విడతలో భాగంగా 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ల ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఏ విధమైన అర్హతలు ఉండాలి, ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేయాలి ? అనే విషయానికి వస్తే..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి కేవలం 18 సంవత్సరాలు నిండిన మహిళలు మాత్రమే అర్హులు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి రేషన్ కార్డ్ కలిగిన వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే వారి కుటుంబంలో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ లేకపోతేనే ఈ పథకానికి అర్హులు. వలస కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తూ వారు ఏ విధమైన ఆధారాలు ఇవ్వకుండానే గ్యాస్ కనెక్షన్ పొందవచ్చని తెలియజేశారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. ఒకవేళ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే https://pmujjwalayojana.com వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో ఇస్తే సరిపోతుంది.