పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 45వేల పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టాఫీస్లలో ఖాళీగా ఉన్న గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాలను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2025లో భాగంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 3ను చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 6 నుంచి 8 మధ్య తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇతర ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన పనిలేదు. వేరే ఏ నైపుణ్యాలు ఉండాల్సిన పనిలేదు. వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 40 ఏళ్ల వరకు ఉండవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఇచ్చారు. దరఖాస్తు ఫీజు రూ.100 కాగా రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాల్లో అవకాశం లభిస్తుంది. ప్రారంభ జీతం నెలకు రూ.20వేలు. ఇతర అలవెన్స్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. అభ్యర్థులను 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేవు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.