వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక. మరి కొద్ది గంటల్లో వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని అమలు చేయనుంది. మే 15వ తేదీ నుంచి ఆ పాలసీ అమలులోకి వస్తుంది. అందువల్ల ఆ తేదీ మారే లోగా.. అంటే ఇంకొన్ని గంటల్లో వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీకి యూజర్లు ఓకే చెప్పాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్ సేవలను ఉపయోగించుకోలేరు.
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఫిబ్రవరి 8వ తేదీ నుంచే తన నూతన ప్రైవసీ పాలసీని అమలు చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. అయితే దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడం, వాట్సాప్ యూజర్లు పెద్ద ఎత్తున టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్లకు మారడంతో వాట్సాప్ దిగి రాక తప్పలేదు. దీంతో నూతన ప్రైవసీ పాలసీని మే 15వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఇక ఆ తేదీ రానే వచ్చింది.
అయితే వాట్సాప్ తన యూజర్లకు అందించే నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే అందులో పూర్తి స్థాయిలో సేవలను పొందలేరని తెలిపింది. నూతన పాలసీని ఓకే చేసేందుకు కొన్ని వారాల పాటు యూజర్లకు రిమైండర్లు పంపిస్తామని, అప్పటి వరకు పాలసీకి ఓకే చెప్పాలని తెలిపింది. అయితే అప్పటి వరకు వాట్సాప్లో వచ్చే మెసేజ్లను చూడలేరని, కానీ వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇక కొన్ని వారాల పాటు అలా కొనసాగినా, పదే పదే రిమైండర్స్ ఇచ్చినా నూతన పాలసీకి ఓకే చెప్పకపోతే అప్పుడు వాట్సాప్ సేవలను పూర్తి స్థాయిలో బ్లాక్ చేస్తారు. దీంతో యూజర్లు వాట్సాప్ సేవలను పొందలేరు. అప్పుడు పాలసీకి ఓకే చెప్పి మళ్లీ సేవలను యథావిధిగా వాడుకోవచ్చు. మరి మీక్కూడా పాలసీని అంగీకరించమని మెసేజ్లు వస్తుంటే వెంటనే ఓకే చెప్పేయండి, లేదంటే వాట్సాప్ సేవలను పొందలేరు.