కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడం వల్ల ఇళ్లలోనే ఉంటున్న చాలా మంది ఈ-కామర్స్ సైట్లలో అన్ని వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. కిరాణా సరుకులు, ఎలక్ట్రానిక్స్ తదితర అనేక వస్తువులను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. దీంతో కావల్సిన వస్తువులు ఇంటికే డెలివరీ అవుతున్నాయి.
అయితే క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలోనూ వస్తువులను కొనుగోలు చేసే సదుపాయాన్ని ఈ-కామర్స్ సంస్థలు అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఇంటి వద్దే నగదు ఇచ్చి తమ వస్తువులను తీసుకోవచ్చు. అయితే కరోనా కారణంగా నగదు ఇవ్వడం రిస్క్తో కూడుకున్న పని. కనుక ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పేమెంట్లు సులభంగా నగదు చెల్లించవచ్చు.
ఫ్లిప్కార్ట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ను ఎంచుకుంటే వినియోగదారులకు చెందిన వస్తువు ప్యాకేజీపై క్యూ ఆర్ కోడ్ను ప్రింట్ చేస్తారు. డెలివరీ సమయంలో ఆ క్యూఆర్ కోడ్ను యూపీఐ యాప్లతో స్కాన్ చేసి పేమెంట్లు చేయవచ్చు. దీంతో సురక్షితంగా పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. కోవిడ్ రిస్క్ తగ్గుతుంది. దీన్నే క్యూఆర్ కోడ్ ఆధారిత పే-ఆన్-డెలివరీ పద్ధతిగా ఫ్లిప్ కార్ట్ పేర్కొంటోంది. ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారికి ఉపయోగపడుతుందని ఫ్లిప్కార్ట్ తెలియజేసింది.