ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని చెన్నై అలవోకగా ఛేదించింది. వికెట్లను కోల్పోయినప్పటికీ తక్కువ ఓవర్లలోనే చెన్నై లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమలో పంజాబ్పై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాట్స్మెన్లలో షారూఖ్ ఖాన్ మాత్రమే ఆకట్టుకున్నాడు. మిగిలిన ఎవరూ రాణించలేదు. 36 బంతులు ఆడిన షారూఖ్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 4 వికెట్లు పడగొట్టాడు. శామ్ కుర్రాన్, మొయిన్ అలీ, డ్వానె బ్రేవోలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 107 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్మెన్లలో మొయిన్ అలీ, డుప్లెసిస్లు రాణించారు. 31 బంతులు ఆడిన అలీ 7 ఫోర్లు, 1 సిక్సర్తో 46 పరుగులు చేయగా, 33 బంతులు ఆడిన డుప్లెసిస్ 3 ఫోర్లు, 1 సిక్సర్తో 36 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్లు చెరొక వికెట్ తీశారు.