టెక్నాలజీ ప్రస్తుతం ఎంతగానో మారింది. అయినప్పటికీ సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా తగ్గలేదు. తమకు కుమార్తె వద్దని, కొడుకే కావాలని చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. కానీ కుమార్తె అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అని, ఆమె పుడితే సంతోషించాలని కొందరు చాటి చెబుతున్నారు. ఆ వ్యాపారి కూడా అలాగే చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మధ్యప్రదేశ్లోని కోలార్ అనే ప్రాంతానికి చెందిన ఆంచల్ గుప్తా 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. గత 20 ఏళ్లుగా పానీ పూరీలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఇటీవల కుమార్తె జన్మించింది. దీంతో తనకు లక్ష్మీదేవి పుట్టిందని అతను సంతోషిస్తూ ఆదివారం అతను రూ.40వేల విలువ చేసే పానీ పూరీలను జనాలకు ఉచితంగా పంపిణీ చేశాడు. అందరూ అతనికి కుమార్తె పుట్టినందుకు అభినందించారు.
ఈ సందర్భంగా ఆంచల్ గుప్తా మాట్లాడుతూ తనకు ఎల్లప్పుడూ కుమార్తె కావాలని ఉండేదని, అయితే మొదటి సంతానంగా కొడుకు పుట్టాడని తెలిపాడు. కానీ రెండో సంతానంగా కుమార్తె జన్మించిందని, తాను అనుకున్న విధంగా జరిగిందని, అందుకనే సంతోషంతో పానీ పూరీలను పంపిణీ చేశానని తెలిపాడు. కాగా ఆంచల్ గుప్తాకు చెందిన ఇద్దరు సోదరులు ఇంజినీర్లుగా స్థిర పడ్డారు. ఈయన మాత్రం పానీ పూరీ వ్యాపారం చేస్తున్నాడు. కానీ గుప్తా భార్య డిగ్రీ చదివింది. దీంతో వారు సొంతంగా టైలరింగ్ వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నారు. తమకు కుమార్తె పుట్టినందుకు అతను పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు.