సూర్య నటించిన గజిని సినిమా గుర్తుంది కదా. అందులో హీరోకు షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఉంటుంది. కొన్ని నిమిషాల తరువాత అంతకు ముందు జరిగింది ఏదీ అతనికి గుర్తుండదు. అయితే ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే జరుగుతాయి.. అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నిజ జీవితంలోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
డానియెల్ పోర్టర్ అనే వ్యక్తి 2020లో ఓ రోజు ఉదయం నిద్ర లేచాక పక్కన పడుకుని ఉన్న తన భార్య రూత్ను గుర్తు పట్టలేదు. ఆమె ఎవరో దారి తప్పి వచ్చి తన ఇంట్లో తన బెడ్ మీద పడకుందని అనుకున్నాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమెను కూడా అతను గుర్తు పట్టలేదు. అంతేకాదు, 20 ఏళ్లుగా జరిగిన ఏ సంఘటనను కూడా గుర్తుంచుకోలేదు. తాను ఉంటున్నది ఇంకా 1999వ సంవత్సరమే అని అతను అనుకుంటున్నాడు. తనకు పెళ్లయిందీ, జాబ్ వచ్చింది, కుమార్తె జన్మించిందీ.. అతనికి ఏదీ గుర్తు లేదు.
దీంతో రూత్ తన భర్తను హాస్పిటల్లో చేర్పించింది. పరీక్షలు చేసిన వైద్యులు అతనికి ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా అనే నాడీ సంబంధ సమస్య వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి అతనికి వైద్యులు థెరపీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.
కాగా డానియెల్ జాబ్ సడెన్గా పోయిందని, దీంతో పెద్ద ఎత్తున ఆర్థిక సమస్యలు వచ్చాయని, వాటిని తట్టేకోలేక అతని మెదడు షాక్కు గురైందని, అందుకనే ఈ సమస్య వచ్చి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక అతనికి ఎప్పుడు నయమవుతుందా ? అని అతని కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.