5G : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలోనే దేశంలో 5జి సేవలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో కీలకప్రకటన చేశారు. పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలోనే 5జి సేవలను ప్రజలు వినియోగించుకోబోతున్నారని ఆమె అన్నారు.

5జి సేవలను అందించేందుకు గాను ముందుగా స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియను ఈ ఏడాది నిర్వహిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అది ముగిస్తే వచ్చే ఏడాది ఆరంభం నుంచే దేశంలో 5జి సేవలు లభిస్తాయని అన్నారు. కాగా ఇప్పటికే జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు 5జి సేవలను అందించేందుకు కావల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటున్నాయి. పలు చోట్ల 5జి ని ఆయా సంస్థలు ప్రయోగాత్మంగా పరీక్షిస్తున్నాయి కూడా. ఇక మొబైల్ తయారీ కంపెనీలు ఇప్పటికే 5జి సపోర్ట్ ఉన్న అనేక స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. దీంతో మరో ఏడాదిలో దేశంలో 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో అత్యధిక వేగంతో ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు.
5G : గ్రామాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్..
కాగా దేశంలోని అన్ని గ్రామాల్లోనూ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను నిర్మిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని వల్ల గ్రామాల్లోనూ అత్యధిక వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. భారత్ నెట్ ప్రాజెక్టు కింద దేశంలోని మారుమూల పల్లెలు, గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను మరో ఏడాదిలో పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి 8 నుంచి 8.5 శాతం మేర వృద్ధి రేటును అంచనా వేస్తున్నామని మంత్రి తెలిపారు. కరోనా సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ ఎంతగానో కోలుకుందని అన్నారు. భారత్ అతి త్వరలోనే కరోనా కారణంగా వచ్చిన నష్టాలను భర్తీ చేసుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు.