Tollywood : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూశారు. ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటూ పలు సినిమాలు కూడా నిర్మించిన మహేష్ ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి ప్రతి ఒక్కరికీ షాకింగ్గా మారింది.
118, తిమ్మరసు, మిస్ ఇండియా వంటి చిత్రాలను కూడా నిర్మించారు మహేష్. ఆయన ఇలా హఠాన్మరణం చెందడం పట్ల చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేస్తోంది. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. మహేష్ మృతితో ఎన్టీఆర్ కూడా షాకయ్యారు. బరువెక్కిన హృదయంతో చెబుతున్నా, నా మిత్రుడు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఎన్టీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మహేష్ కోనేరు ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై విశ్లేషణ చేస్తూ వీడియో విడుదల చేశారు. పెద్ద వాహనాల గురించి తెలియని చాలామంది సాయిధరమ్ తేజ్కు జరిగిన ప్రమాదంపై మిడి మిడి జ్ఞానంతో కామెంట్స్ చేస్తున్నారు. అతను అతి వేగంగా, బాధ్యతా రాహిత్యంతో డ్రైవింగ్ చేసే వ్యక్తి కాడు. రోడ్డుపై మట్టి, ఇసుక ఉండడం వల్ల ముందు వెళుతున్న వాహనాలు స్లో అయ్యాయి. సాయి నెమ్మదించి పక్కనుంచి వెళ్లాలనుకున్నాడు. అయితే అక్కడ ఇసుక ఉండడంతో జారి పడిపోయాడు.. అని స్పష్టం చేశాడు.