Whatsapp : ప్రస్తుతం సోషల్ మీడియాను ప్రజలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అందరికీ తెలిసిందే. అనేక సామాజిక మాధ్యమాల్లో వారు యాక్టివ్గా ఉంటున్నారు. దీంతో కొందరు ప్రబుద్ధులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాగే వాట్సాప్ లోనూ ఓ మెసేజ్ విపరీతంగా షేర్ అవుతోంది.
సదరు వాట్సాప్ మెసేజ్లో ఓ సందేశం కనిపిస్తోంది. అమూల్ డెయిరీ 75వ వార్షికోత్సవం సందర్బంగా ఓ కాంపిటీషన్ నిర్వహిస్తోందని, ఓ సర్వేలో పాల్గొని వివరాలను నింపి పంపితే రూ.6000 గెలుచుకోవచ్చంటూ అందులో ఉంది. అలాగే వివరాలను నమోదు చేయాల్సిందిగా ఓ లింక్ కూడా అందులో ఉంది. అయితే నిజానికి పేరు అమూల్ అని ఉంది కానీ.. ఆ వెబ్సైట్ మాత్రం వేరేది. అమూల్ ది కాదు. అందువల్ల ఈ మెసేజ్ నకిలీ మెసేజ్ అని నిర్దారణ అయింది.
కనుక ఎవరైనా సరే వాట్సాప్ లో తమకు ఈ మెసేజ్ వస్తే దానికి స్పందించకూడదని, అందులో ఇచ్చిన లింక్ను ఓపెన్ చేస్తే అంతే సంగతులని.. డబ్బులు కోల్పోయేందుకు అవకాశాలు ఉంటాయని, ఫోన్ వినియోగదారులకు చెందిన డేటా అంతా చోరీకి గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక మీకు ఈ లింక్ వస్తే ఎట్టి పరిస్థితిలోనూ ఓపెన్ చేయకండి.