Tollywood : గత కొద్ది రోజులుగా ఏపీలో టిక్కెటింగ్ వ్యవహారంతోపాటు ఇతర విషయాలపై కూడా గందరగోళం నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెటింగ్ వ్యవస్థ ఇష్ఠానుసారం ధరల్ని పెంచుకోవడాన్ని నియంత్రించ వచ్చని, ఒక సెక్షన్ నిర్మాతలు ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారు. తాజాగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని అన్నారు.
పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలాగే టిక్కెట్ రేట్లను తమ ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతున్నారని, దానికి జీఎస్టీ ని కూడా వారు చెల్లించడం లేదని నాని అసెంబ్లీలో ఆరోపించారు. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోందని చెప్పారు.
టికెట్ల విక్రయం కోసం ఇండియన్ రైల్వేస్ వినియోగిస్తున్న ఐఆర్సీటీసీ తరహాలోనే సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం కారణంగా టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ , భీమ్లా నాయక్ , అఖండ , ఆచార్య , సర్కారువారి పాట , పుష్ప , రాధేశ్యామ్ వంటి భారీ బడ్జెట్ సినిమాలపై ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రభుత్వ నిర్ణయంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది. గతంలో ఈ బిల్లు విషయమై నిర్మాత డి.వి.వి.దానయ్య సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఈ విషయంలో కోర్టుకు వెళ్లే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ బిల్లుపై ఏం చేస్తారనేది చూడాలి.