ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే సోమవారం మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్య వాణిని వినిపిస్తూ.. ఈ సారి భక్తులు చాలా కష్టాలు పడ్డారని, అయినప్పటికీ తనకు మొక్కులు చెల్లించారని అన్నారు.
భక్తులందరినీ తాను కాపాడుతానని, వారు సంతోషంగా ఉండే విధంగా చూస్తానని తెలిపారు. ప్రజలు పలు సమస్యల వల్ల ఇబ్బందులు పడుతుంటే రైతులు వర్షాల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారని, అయితే అందరినీ తాను రక్షిస్తానని తెలిపారు. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు. కరోనా భయ పెడుతున్నా ప్రజలు తనను నమ్మి తన మొక్కులు తీర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
అమ్మవారికి ఇంత చేస్తున్నాం, అయినా అమ్మవారు మనల్ని పట్టించుకోవడం లేదు.. అని ఎవరూ అనుకోకూడదని, అందరినీ కాపాడుతానని తెలిపారు. ప్రజల కష్టాలను తీరుస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణలతకు చీర, ఒడి బియ్యం సమర్పించారు.