గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అయితే గుడ్డును వివిధ రూపాలలో తీసుకోవడం చూస్తుంటాము. ఈ క్రమంలోనే గుడ్డు ఉడికించి మసాలా గ్రేవీతో తయారు చేసుకుంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా గుడ్డులో ఉన్నటువంటి పోషకాలన్నీ సంపూర్ణంగా మన శరీరానికి అందుతాయి. మరి మసాలా ఎగ్ గ్రేవి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*గుడ్లు 6
*కొబ్బరి పొడి రెండు స్పూన్లు
*ధనియాల పొడి టీ స్పూన్
*లవంగాలు 3
*దాల్చిన చెక్క 1
*కొత్తిమీర కొద్దిగా
*అరకప్పు ఉల్లిపాయ ముక్కలు
*వెల్లుల్లి రెబ్బలు పది
*పసుపు చిటికెడు
*ఉప్పు తగినంత
*అల్లం ముక్క
*కారం స్పూన్
*నూనె తగినంత
*పోపు దినుసులు
*నీళ్లు తగినంత
తయారీ విధానం
ముందుగా కోడిగుడ్లను ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి కొబ్బరి పొడి, ధనియాల పొడి, కోతిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.కోడిగుడ్లు ఉడకగానే నీటుగా పెంకు తీసుకొని మనం అవసరం అనుకుంటే గుడ్లను కట్ చేసుకోవచ్చు లేదా చిన్నగా హోల్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎగ్ లోపల కూడా మసాలా అంటుకొని ఎంతో రుచిగా ఉంటుంది.
స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేయాలి.ఆవాలు చిటపట అనగానే ముందుగా తయారు చేసి పెట్టుకొన్న మసాలా మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై బాగా కలియబెట్టాలి. ఈ మసాలా మిశ్రమం లోకి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, స్పూన్ కారం వేసి బాగా కలియబెట్టాలి. ఒక రెండు నిమిషాలు పాటు మసాలా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ప్లేట్ వేసి మసాలా మిశ్రమాన్ని బాగా ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత ఉడుకుతున్న మసాలా మిశ్రమంలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా ఎగ్ గ్రేవీ తయారైనట్లే. ఎగ్ గ్రేవీ చపాతీ, రోటి వంటి వాటిలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది.