దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు ప్రతి పల్లెకు తాకాయి.పల్లెల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కరోనా బారినపడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ విధంగా కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజిపేట్ గ్రామంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
ఈ విధంగా ఒక మారుమూల గ్రామంలో కరోనా కేసులు నమోదు కాకపోవడానికి గల కారణం ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు పాటిస్తున్న జాగ్రత్తలు అని చెప్పవచ్చు. గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి శానిటైజర్ లను ఉపయోగిస్తారు. గ్రామంలో తరచూ పారిశుద్ధ్య పనులను ఎంతో చక్కగా నిర్వహిస్తారు.ఆ గ్రామం నుంచి ఎవరైనా బయటకు వెళ్లి వస్తే తప్పకుండా పసుపు నీటితో స్నానం చేసి మూడు పూటలా గోరువెచ్చని నీటిని తాగుతారు.
ఇతర గ్రామాల నుంచి ఆ గ్రామంలోకి బయట వ్యక్తులు ఎవరైనా వస్తే వారికి మాస్క్ ను ఇచ్చి శానిటైజర్ వేసి వారిని ఎక్కువ సేపు తమ గ్రామంలో ఉండకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. కరోనా మొదటిదశ వ్యాప్తి చెందినప్పుడు ఈ గ్రామంలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. తరువాత ఆ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఎంతో విశేషం. ఈ గ్రామం పట్ల సర్పంచ్ తీసుకుంటున్న జాగ్రత్తలు మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలిచాయి. ఈ విధమైన జాగ్రత్తలను పాటించడం వల్ల ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.