Sonu Sood : కరోనా కాలంలో చేతికి ఎముక లేదన్నట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి మనసులలోనూ చెరగని ముద్ర వేసుకున్నాడు సోనూసూద్. సోమవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తోపాటు సినీ నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. ఎలాంటి స్వార్ధం లేకుండా మానవత్వంతో సేవా భావం చాటుకున్నారు సోనూసూద్. సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నపుడు ఒక్క ప్రభుత్వమే అన్నీ చేయలేదని, స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతైనా అవసరం అని పేర్కొన్నారు. సోనూ సూద్ సేవ చేస్తే ఐటీ దాడులు, ఈడీ సోదాలు చేసి ఆయన్ని భయపెట్టాలని చూశారు. ఆయన భయపడాల్సిన అవసరం లేదు. తామంతా సోనూ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్.
కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళు ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉండదని అన్నారు సినీ నటుడు సోనూ సూద్. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఏడున్నర లక్షల మందికి సహాయం అందించినట్లు చెప్పారు. ఆక్సిజన్, మందులు, బెడ్స్ కావాలంటూ అర్థరాత్రులు కూడా కాల్స్ వచ్చేవని అన్నారు సోనూసూద్. కోవిడ్తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని అన్నారు. వాళ్లకు సహాయ పడడమే ఇక తన ముందున్న సవాల్ అని సోనూ స్పష్టం చేశారు.