Sirivennela : దాదాపు మూడు వేల పాటలతో మనల్ని రంజింపజేసిన సిరివెన్నెల కలం ఆగింది. ఇక భౌతికంగా ఆయన మధ్య లేకపోయినా పాటలతో నిత్యం ప్రేక్షకులని పలకరిస్తూనే ఉంటారు. ఆయనతో కాసేపు మాట్లాడితే గ్రంథాలయానికి వెళ్లవలసిన అవసరం లేదనుకునేవారు చాలా మందే ఉన్నారు. ఆయన పలకరిస్తే చాలు.. పరిచయం కలిగితే చాలు.. అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. పాట రాయడమంటే ఆయన దృష్టిలో ఒక తపస్సు.. పాట రాయడమంటే ఆయన దృష్టిలో ఒక యజ్ఞం చేయడం.
విశాఖకు చెందిన సాహితీవేత్త నండూరి రామకృష్ణతో సిరివెన్నెలకు మంచి స్నేహం ఉంది. ఆ స్నేహబంధాన్ని కుటుంబ బంధంగా మార్చుకున్నారు. తన కుమార్తె లలితా దేవిని నండూరి రామకృష్ణ తనయుడు వెంకట సాయిప్రసాద్కు ఇచ్చి వివాహం జరిపించారు. 2001 మే 8న విశాఖలో ఈ వివాహం జరిగింది. అభిమాని నుంచి వియ్యంకుడిగా.. సిరివెన్నెలతో తన అనుబంధం గురించి నండూరి రామకృష్ణ చాలా ఎమోషనల్ అయ్యారు.
2001కి ముందు జరిగిన నా కుమారుడు నండూరి సాయిప్రసాద్ ఒడుగు ఫంక్షన్కు సీతారామశాస్త్రి కూడా హాజరయ్యారు. అప్పుడే తన కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అలా మా కుమారుడుకి ఆయన కూతురు లలితా దేవితో వివాహం జరిగింది. దీంతో ఆయన అభిమాని అయిన నేను వియ్యంకుడయ్యాను. సీతారామశాస్త్రి విలువలు కలిగిన సాహిత్యాన్ని సమాజానికి అందించారు. అశ్లీలతకు ఆయన సాహిత్యంలో ఏనాడూ చోటు లేదని అన్నారు.
Sirivennela : 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు
తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి. ఆయన మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. భౌతికంగా సిరివెన్నెల మనకు దూరమైనా పదాల రూపంలో నిత్యం మన మధ్యనే ఉంటారు.