RRR Movie : టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ సినీలవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం వైఖరితో తెలుగు చిత్ర పరిశ్రమ రాబోయే రెండు నెలల్లో తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. టిక్కెట్ ధరలని తగ్గించిన నేపథ్యంలో నిర్మాతలు నష్టపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో తగ్గించిన టిక్కెట్ ధరలను ఇంకా అలాగే కొనసాగిస్తోంది.
గత కొన్ని నెలలుగా సినీ ప్రముఖులతో భేటీలు జరుగుతున్నా ఈ విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే సినిమా టికెట్ ధరలపై ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించబోతున్నారు.. అనే వార్తలు వచ్చాయి.
దీనిపై ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత దానయ్య స్పందించారు. ఈ వివాదంపై దానయ్య మాట్లాడుతూ.. సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడం మా సినిమాపై మాత్రమే కాదు అన్ని సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి మాకు కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు, ఏపీ ముఖ్యమంత్రిని సంప్రదించి మా పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు. సినిమా టికెట్ ధరల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం.. అని తెలిపారు.