Prakash Raj :మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అయితే మంచు విష్ణు ఇప్పటికే కృష్ణతోపాటు బాలకృష్ణను కూడా కలిసి మద్దతు తీసుకున్నారు. కాగా ప్రకాష్ రాజ్ మాత్రం ఇండస్ట్రీ పెద్దలను కలవడం లేదు. కానీ సినీ నటులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అయితే మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి పెద్దల ఆశీర్వాదం అవసరం లేదని, తనకు గెలిచే సత్తా ఉందని అన్నారు. పెద్దోళ్లను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే మా అధ్యక్షుడిగా గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎవరి దయా దాక్షిణ్యాలు తనకు అవసరం లేదని, మా ఎన్నికల్లో గెలిచి చూపిస్తానని అన్నారు.
కాగా ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు మంచు విష్ణును ఉద్దేశించి చేసినవే అని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. మంచు విష్ణు తాజాగా ఇండస్ట్రీ పెద్దలందరినీ వరుసపెట్టి కలుస్తున్నాడు. అటు నరేష్ మద్దతు ఉండడంతో ఇప్పటికే కృష్ణను కలిశారు. ఇక మోహన్బాబుకు టీడీపీతో గతంలో ఉన్న అనుబంధం దృష్ట్యా బాలకృష్ణ సన్నిహితుడు కనుక ఆయనను కూడా మంచు విష్ణు కలిశారు. దీంతో ప్రకాష్ రాజ్ కు ఇది మింగుడు పడని విషయంగా మారిందని చర్చ నడుస్తోంది. అందుకనే ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పెద్దలను ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు రానుండడంతో.. ఇప్పుడు మా పీఠంపై కూర్చోబోయేది ఎవరు ? అని చర్చించుకుంటున్నారు. కాగా ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పెద్దలను ఉద్దేశించి చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఆయన వారి ఆశీర్వాదం లేకుండా గెలుస్తారో, లేదో చూడాలి.