హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షంలో దేవీ నవరాత్రులను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాలలో అలంకరించి భక్తులు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే నవరాత్రులలో నేడు మొదటిరోజు కావడంతో అమ్మవారు మనకు శైలపుత్రిగా దర్శనమివ్వనున్నారు.
నవరాత్రి మొదటి రోజులో భాగంగా అమ్మవారికి ఏ విధమైన వస్త్రాలను సమర్పించాలి. ఎలాంటి నైవేద్యం పెట్టాలి ? ఏ విధమైన పుష్పాలతో అమ్మవారిని పూజించాలి.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నవరాత్రులలో భాగంగా అమ్మవారిని శైలపుత్రిగా రెండు సంవత్సరాల బాలిక రూపంలో పూజిస్తాము. అమ్మవారికి నేడు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. అదేవిధంగా మల్లెపువ్వులు, జాజిపువ్వులతో అమ్మవారికి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. అదేవిధంగా మొదటిరోజు నైవేద్యంగా అమ్మవారికి పొంగలి సమర్పించాలి.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పూజలు చేసేవారు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేయాలి. కలశం ముందు అఖండ దీపం వెలిగించిన వారు ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. నేడు పూజ చేయడానికి ఉదయం 10:30 నుంచి 12, సాయంత్రం 6:00 నుంచి 7:30 గంటల వరకు ఎంతో అనువైన సమయం.