టాలీవుడ్ లో స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలంటేనే భయపడుతుంటారు. కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తే.. సినిమా హిట్ అవుతుందన్న గ్యారెంటీ ఉండదు, అలాగే కొత్త దర్శకులు తమను సరిగా హ్యాండిల్ చేయలేరని చాలా మంది హీరోలు భావిస్తూ ఉంటారు. అయితే నందమూరి హీరోలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటున్నారు.
బాలయ్య విజయేంద్ర వర్మతో స్వర్ణ సుబ్బారావు, మిత్రుడు సినిమాతో మహదేవ్, లయన్ సినిమాతో సంగీత సత్యదేవ లాంటి కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఆయన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తో దర్శకధీరుడు రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అలాగే ఎన్టీఆర్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమా ఆది సినిమాతో వివి వినాయక్ కూడా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
అలాగే మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా కొత్త దర్శకులను పరిచయం చేయటంలో ఎప్పుడూ ముందుంటున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మించిన అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. అలాగే కళ్యాణ్ రామ్ డైరెక్టర్ మల్లికార్జున రావు కాంబినేషన్లో అభిమన్యు, షేర్, కత్తి సినిమాలు వచ్చాయి.
ఇక తాజాగా వచ్చిన బింబిసార సినిమాతో ఎలాంటి అంచనాలు లేని మల్లిడి వశిష్ట అనే దర్శకుడిని కళ్యాణ్ రామ్ హీరోగా పరిచయం చేశాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అలా నందమూరి హీరోలు కొత్త డైరెక్టర్లను పరిచయం చేయగా వారిలో చాలా మంది స్టార్ దర్శకులుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం విశేషం. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి ఎంతోమంది యువ దర్శకులకు నమ్మకాన్ని ఇచ్చారు ఈ నందమూరి హీరోలు.