Nagarjuna : ఏపీ సీఎం జగన్ని తెలుగు సినిమా నటుడు నాగార్జున కలవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్తో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. నాగార్జునతోపాటు సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు. గురువారం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో సినీ టికెట్లను ఆన్ లైన్ లో అమ్మకంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అందుకనే హీరో నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు విజయవాడకు వెళ్లినట్టు టాక్. నాగార్జున – జగన్మోహన్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉందనే సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్ తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ వంటి అంశాలు చర్చకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ నుంచి ఏ సినీ పెద్దలు.. సినీ నటీనటులు లేరు.. కేవలం ఇద్దరు నిర్మాతలతో వెళ్లినందున ఇప్పుడు సీఎం జగన్ తో సమావేశం టాలీవుడ్ సమస్యలపైనా లేక వ్యక్తిగత విషయాలను చర్చించేందుకు వచ్చారా ? అనే విషయంపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.