Aryan Khan : క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలతో నమోదు అయిన కేసు విషయమై గత 20 రోజులుగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్కు బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది. ఆర్యన్తోపాటు మరో ఇద్దరికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆర్యన్ శుక్రవారం జైలు నుంచి విడుదల కానున్నాడు.
అయితే ఆర్యన్ఖాన్ ఇదివరకే పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఎన్సీబీ ప్రవేశపెట్టిన సాక్ష్యాలు పకడ్బందీగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీంతో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయలేదు. ఈ క్రమంలో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఎంటరయ్యారు. ఆయన గత రెండు, మూడు రోజుల నుంచి బాంబే హైకోర్టుకు వచ్చారు. ఆర్యన్ తరఫున వాదించారు. ఈ క్రమంలో ఆర్యన్కు కోర్టు బెయిల్ మంజూరు చేయడం విశేషం.
ఆర్యన్ జైలులో ఉండడంతో షారూఖ్ కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు భోజనం కూడా సరిగ్గా చేయడం లేదని వార్తలు వచ్చాయి. మరోవైపు షారూఖ్, ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లినప్పుడల్లా వారిని చూసి ఆర్యన్ కన్నీటి పర్యంతమయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. జైలులో ఇచ్చే ఆహారాన్ని ఆర్యన్ తినలేదని, తండ్రి ఇచ్చిన రూ.2వేలతో బిస్కెట్లను కొని తింటూ నీళ్లు తాగాడని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆర్యన్ బెయిల్పై శుక్రవారం విడుదల కానుండడంతో అతని ఇంట్లో సంతోషాలు నెలకొన్నాయి.