Balakrishna : సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై తన మార్క్ ఏంటో చూపించిన బాలయ్య తాజాగా ఆహా వేదికగా అన్స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇక ఈ కార్యక్రమాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నారు.
మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా మారిన బాలకృష్ణ ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎలా సందడి చేయనున్నారోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు వస్తారని, వారి గురించి బాలకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలోని మొదటి ఎపిసోడ్ కి మోహన్ బాబు అతిథిగా రాబోతున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మెగా బ్రదర్ నాగబాబు, బాలకృష్ణ మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలా ఎడమొహం పెడమొహం ఉన్న వీరిద్దరూ అన్స్టాపబుల్ వేదికగా కలవనున్నట్లు సమాచారం. మరి ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు పాల్గొంటే బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. అనే విషయంపై ఎంతో ఆతృత నెలకొంది.