సాధారణంగా ఈ రోజుల్లో ఎవరైనా అగ్ర హీరో సినిమా విడుదలైందంటే చాలు, థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు, తమ అభిమాన హీరోకి భారీ స్థాయిలో కట్ అవుట్లు ఏర్పాటు చేయడం, దండలు వేయడం పాలాభిషేకాలు.. ఇలాంటివి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొన్ని సందర్భాల్లో అభిమానులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల థియేటర్ యజమానులు ఎంతో నష్టాన్ని భరించవలసి వస్తోంది. ఇలాంటి సంఘటనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ థియేటర్లో చోటు చేసుకుంది.
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని థియేటర్లలో భారీ ఎత్తున ప్రదర్శించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ఈ మూవీ ఘన విజయాన్ని సాధించింది. కాగా ఇంత వరకు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మూవీని ఇంత భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయలేదు. ఇదే మొదటి సారి అని చెబుతున్నారు.
అయితే కొందరు అభిమానులు అత్యుత్సాహంతో ఓ థియేటర్ లో సినిమా తెర వద్దకు వెళ్లి దాన్ని చించేశారు. దీంతో థియేటర్ యజమానికి నష్టం కాస్త ఎక్కువగానే వచ్చిందని అంటున్నారు. చిరిగిపోయన తెరను మార్చడానికి కనీసం రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇక అభిమానుల సంతోషం కోసం సినిమాను ప్రదర్శించినపుడు వాళ్లు ఇలా చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని అంటున్నారు.
ఇలా చేయడం అనేది ఒక పనికిమాలిన చర్యగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాబోయే సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ జన్మదినం కావడంతో ఇదే విధంగా ఆయన నటించిన జల్సా సినిమాని కూడా పెద్ద స్థాయిలో రీ రిలీజ్ చేయాలని పవన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. మరి ఆ రోజు ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తారో చూడాలి.