Maa : మా ఎన్నికల నేపథ్యంలో జరిగిన గొడవలు, ఇతర పరిణామాలపై ప్రకాష్ రాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్యానెల్ లో గెలిచిన 11 మంది రాజీనామా చేస్తారని చెప్పారు. మంచు విష్ణు తనకు కావల్సిన వాళ్లను పెట్టుకుని మా ను అభివృద్ధి చేయవచ్చని.. తాము బయటి నుంచి సపోర్ట్ ఇస్తామని అన్నారు.
అయితే విలేకరుల సమావేశం సందర్బంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్ బెనర్జీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అర గంట పాటు తనను బండ బూతులు తిట్టారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ కుటుంబంలో తాను ఎన్నో ఏళ్ల నుంచి ఒక సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. మంచు లక్ష్మీ, మంచు విష్ణులను తన చేతుల్తో ఎత్తుకున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇకపై తాను మా లో కొనసాగలేనని, మంచు విష్ణు అభివృద్ది చేస్తాడన్న నమ్మకం ఉందని.. కనుక బయటకు వచ్చేస్తున్నానని బెనర్జీ తెలిపారు. తన కుటుంబంతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.