Maa : మా అసోసియేషన్ ఎన్నికలు రగిల్చిన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ తోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న నాగబాబు ఇది వరకే రాజీనామా చేశారు. తమ రాజీనామాలను మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఇప్పటికే పంపించారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాము బయటనే ఉంటామని, మంచు విష్ణు తనకు ఇష్టం వచ్చిన వారిని మా సభ్యులుగా ఎంపిక చేసి వారందరితో కలిసి పనిచేయవచ్చని.. వారు ఏ పని చేసినా తాము చూస్తూనే ఉంటామని.. అయితే ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాలని.. మా సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని.. లేదంటే తాము ప్రశ్నిస్తామని తెలిపారు.
ఇక మా అసోసియేషన్ కు తాను చేసిన రాజీనామాను మంచు విష్ణు ఆమోదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. బయటి రాష్ట్రాలకు చెందిన వారు మా లో పోటీ చేయొద్దు, కేవలం సభ్యులుగా మాత్రమే ఉండాలని బై లాస్ మార్చితే తన రాజీనామాను ఆమోదించాలని, లేదంటే తాను తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని.. ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.