Karthikeya Wedding : ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఎట్టకేలకు ఒక ఇంటి వాడయ్యాడు. ఆదివారం హైదరాబాద్లో కార్తికేయ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తన కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, పాయల్ రాజ్పూత్ పెళ్లిలో సందడి చేశారు.
ఈ పెళ్లి వేడుకకు పాయల్ రాజ్ పూత్ తన ప్రియుడు సౌరబ్ దింగ్రాతో హాజరైంది. అలాగే సాయికుమార్, దర్శకుడు అజయ్ భూపతి, సుధాకర్ కోమాకుల, రోహిత్, తనికెళ్ల భరణిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కార్తికేయ తన చిన్ననాటి స్నేహితురాలు లోహితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఉదయం 9.47 గంటలకు కార్తికేయ, లోహితల వివాహం జరిగింది.
కార్తికేయ నటించిన తాజా చిత్రం రాజా విక్రమార్క ఇటీవలే విడుదలైంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ.. లోహితకు ప్రపోజ్ చేశాడు. తనను అభిమానులకు పరిచయం చేశాడు. 2010లో లోహితను అతను మొదటి సారిగా కలుసుకున్నాడు. వరంగల్ నిట్లో చదివే రోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ నిన్న మొన్నటి వరకు వారి ప్రేమ విషయం ఇంట్లో తెలియదు. హీరోగా సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానన్న కార్తికేయ.. అలా జరగ్గానే తన ప్రేమ విషయం చెప్పి ఇరు కుటుంబాలకు చెందిన వారిని ఒప్పించి ఈ పెళ్లి చేసుకున్నాడు.
కార్తికేయ ఆర్ఎక్స్ 100 తో బంపర్ హిట్ అందుకున్నాడు. తరువాత హిప్పి, గుణ 369, 90 ఎంఎల్, చావు కబురు చల్లగా వంటి చిత్రాలు చేశాడు. నాని గ్యాంగ్ లీడర్ మూవీలో విలన్గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఆయన తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న వాలిమై చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.
కాగా కార్తికేయ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.