ఆవు పేడను ఒంటికి రాసుకుంటే కోవిడ్ తగ్గుతుందా ? అంటే.. అక్కడి వాసులు అవుననే అంటున్నారు. అందుకనే వారు రోజూ గంటల తరబడి ఆవు పేడ, మూత్రం కలిపిన మిశ్రమాన్ని ఒంటికి పట్టించుకుంటున్నారు. తరువాత ఆవు పాలు లేదా మజ్జిగతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంత వాసులకు ఇది నిత్య కృత్యంగా మారింది.
గుజరాత్లోని అహ్మదాబాద్ నగర శివార్లలో శ్రీ స్వామి నారాయణ గురుకుల విశ్వ విద్య ప్రతిస్థానం గోశాలలో రోజూ చాలా మంది శరీరాలకు ఆవుపేడను పట్టించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కోవిడ్ నయం అవుతుందని అంటున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీకి చెందిన గౌతమ్ మనీలాల్ బోరిసా అనే వ్యక్తి ఇలాగే చేశాడట. దీంతో అతను కోవిడ్ నుంచి త్వరగా కోలుకున్నాడట. ఈ మాట అతను అందరికీ చెప్పాడు. దీంతో అందరూ అలాగే చేయడం మొదలు పెట్టారు. ఇలా అక్కడికి రోజూ వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. ఆవు పేడతో కోవిడ్ తగ్గదని, పైగా ఆవు పేడను శరీరానికి రాసుకుంటే బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని, కనుక ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని సూచిస్తున్నారు. అయినప్పటికీ అక్కడి వారు మాత్రం తమ పనిని కొనసాగిస్తున్నారు.