భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ ప్రభావం విమానయాన సంస్థ పై పడింది.భారత్ లో కేసులు అధికంగా ఉండటంతో ఇప్పటికే పలు దేశాలు ఇండియా నుంచి విమానాల రాకపోకలను నిషేధం విధించారు. ఇప్పటికే యూకే, జర్మన్, యూఏఈ వంటి దేశాలు భారత్ నుంచి విమానాలను నిషేధించారు.ఈ విధంగా పలు దేశాలు విమాన రాకపోకలు పై కఠిన నిబంధనలు విధించడంతో ఈ ప్రభావం అమెరికా వెళ్లే వారిపై పడింది.
ఇప్పటివరకు ఇండియా నుంచి అమెరికా వెళ్ళడం కోసం అమెరికా ప్రభుత్వం విమానాలను నిషేధించలేదు. అమెరికా నిబంధనల ప్రకారం ఇండియా నుంచి అమెరికాకి రావచ్చు కానీ.. అమెరికా నుంచి ఇండియాకు వెళ్లకూడదని అమెరికా పౌరులకు అగ్రరాజ్యం ఆదేశాలను జారీ చేసింది.ఇండియాలో రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉండడంతో అమెరికా వెళ్లాలనుకునేవారు ఇప్పుడే అమెరికాకు పయనమవుతున్నారు.
ఈ క్రమంలోనే అమెరికా వెళ్లే విమానాలు రద్దీగా ఉండడంతో విమానయాన సంస్థలు టికెట్ల ధరలను అమాంతం పెంచేశాయి.సాధారణ రోజుల్లో అమెరికా వెళ్లేందుకు టిక్కెట్ ఫేర్ సుమారు రూ.50 వేల వరకూ ఉంటుంది. కానీ రద్దీ కారణంగా ప్రస్తుతం రూ.1.5 లక్షలకు చేరినట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఒక్కసారిగా ట్రావెల్ ఏజెన్సీలు టిక్కెట్ ధరలను మూడు రెట్లు అధికం చేసాయి.