దేశ వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి కోవిడ్ టీకాలను వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాలు మాత్రం తమ వద్ద తగినన్ని కోవిడ్ టీకాలు లేవని తెలిపాయి. ఇంతకు ముందు కోవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు ఇచ్చేందుకే టీకాలు లేవని, అందువల్ల 18-44 ఏళ్ల వయస్సు వారికి టీకాలను ఇవ్వలేమని కొన్ని రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. దేశంలో టీకాల కొరత ఏర్పడినందునే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సమయంలో ప్రజలకు ఊరటనిచ్చే వార్త ఒకటి వచ్చింది.
మే 1వ తేదీ నుంచి దేశంలో రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకాలను పంపిణీ చేయనున్నారు. రష్యా నుంచి తొలి లాట్ టీకాలు శనివారం భారత్కు రానున్నాయి. భారత్కు స్పుత్నిక్-వి టీకాలను దిగుమతి చేసుకునేందుకు డాక్టర్ రెడ్డీస్కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అందులో భాగంగానే తొలి లాట్ మే 1వ తేదీన భారత్కు రానుంది. దీంతో వ్యాక్సిన్లకు కొంత వరకు కొరత తీరనుంది. అయినప్పటికీ పెద్ద ఎత్తున టీకాల అవసరం ఏర్పడింది.
కాగా దేశంలో ప్రస్తుతం భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో స్పుత్నిక్-వి టీకా వాటి సరసన చేరనుంది. రష్యాలోని గమాలెయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ను తయారు చేసింది. దీనికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గతంలోనే అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం భారత్లో కోవిడ్ టీకాల కొరత ఉన్న తరుణంలో స్పుత్నిక్-వి టీకాలు వస్తుండడం కొంత వరకు ఊరటనిస్తోంది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 16.33 కోట్ల టీకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇచ్చామని కేంద్రం తెలిపింది. రాష్ట్రాల వద్ద ఇప్పటికీ 1 కోటి డోసులు ఉన్నాయని, మరో 3 రోజుల్లో 19 లక్షల డోసులను అందజేస్తామని తెలిపింది.