Evelyn Sharma : సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కొన్ని సందర్భాల్లో వివాదాలకు కారణమవుతుంటాయి. అయితే కొన్ని సార్లు వారు ఎలాంటి పొరపాటు చేయకపోయినా.. నెటిజన్ల విమర్శలకు గురవుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఎవ్లిన్ శర్మకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాను తల్లి పాలు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ పెట్టిన పోస్టు కొందరికి నచ్చకపోగా.. వారు ఆమెను విమర్శిస్తున్నారు.
ఎవ్లిన్ శర్మ తన 2 నెలల కుమార్తె అవా భిండికి పాలిస్తూ దిగిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తల్లిపాలు బిడ్డకు ఎంత ముఖ్యమో ఆమె ఆ పోస్టులో తెలియజేసింది. అయితే ఆమె ఆ పోస్టు పెట్టినందుకు కొందరు నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ఇలాంటి ప్రయివేటు ఫొటోలను కూడా షేర్ చేయాలా ? అవసరమా ? అని కామెంట్లు చేశారు. అయితే ఆ కామెంట్లకు ఆ నటి స్పందించింది.
తాను తల్లి పాల ఆవశ్యకతను తెలియజేస్తూ ఆ పోస్టు పెట్టానని.. ఇందులో ప్రయివేటు ఏముందని ఆమె ప్రశ్నించింది. బిడ్డకు జన్మనివ్వడం అంటే తల్లికి పునర్జన్మ లాంటిదని, పిల్లలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిర్మొహమాటంగా తాను ఆ పోస్ట్ పెట్టానని.. ఇందులో తప్పేముందని.. తల్లులందరూ తమ పిల్లలకు కచ్చితంగా పాలివ్వాలని.. నటి ఎవ్లిన్ శర్మ తనపై విమర్శలకు కౌంటర్ ఇచ్చింది.
View this post on Instagram
కాగా ఎవ్లిన్ శర్మ మే 15, 2021వ తేదీన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్కు చెందిన తుషాన్ భిండి అనే ఓ డెంటల్ సర్జన్ను వివాహం చేసుకుంది. తరువాత నవంబర్ 12, 2021వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు వారు అవా భిండి అని నామకరణం చేశారు. గతంలో ఎవ్లిన్ శర్మ.. యే జవానీ హై దీవానీ, యారియా, జబ్ హారీ మెట్ సెజల్, కుచ్ కుచ్ లోచా హై అనే చిత్రాల్లో నటించింది. చివరిగా సాహో చిత్రంలోనూ ఈమె కనిపించింది.