Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రారంభం రోజే ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చారు. ఇక ఆ మొదటి రోజే టీఆర్పీ రేటింగ్ రికార్డ్ సృష్టించింది. ఇక సెప్టెంబర్ 20న సోమవారం ఈ షోకు డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా హాజరై సందడి చేశారు.
ఇక దసరా రోజు సమంత ఈ షోకి హాజరై ఎన్టీఆర్తో కలిసి వినోదం పంచింది. ఈ షోకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంత వరకు అఫీషియల్ ప్రకటన లేకపోగా, తాజాగా నిర్వాహకులు ఓ పోస్టర్ విడుదల చేసి అభిమానులలో ఆనందం నింపారు.
అతి త్వరలోనే ఈ షో ప్రసారం కానుందని తెలియజేస్తూ ఎన్టీఆర్, మహేష్ ఫొటో విడుదల చేశారు. టీఆర్పీ రేటింగ్ పెంచడానికి నిర్వాహకులు.. ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేములోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
తారక్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతోంది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి షో ఆధారంగా వచ్చింది ఎవరు మీలో కోటీశ్వరులు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ కింగ్ నాగార్జున బుల్లితెరపై సందడి చేయగా.. తాజాగా తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు.. అంటూ అలరిస్తున్నారు. ఇక మహేష్, ఎన్టీఆర్ల ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.