Actress Chaurasia : నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్వేలో వాకింగ్ చేస్తున్న నటి చౌరాసియాపై ఓ దుండగుడు దాడి చేసి ఫోన్ ను దొంగిలించిన విషయం తెలిసిందే. ఈ కేసుని చాలా చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. నిందితుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్మెన్గా పని చేస్తున్న కె.బాబు (30)గా గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్లో అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం రాత్రి వాకింగ్ చేస్తున్న షాలూ చౌరాసియాపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని పేటీఎం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. బండ పక్కన కిందకు తోసేసి ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు. అయితే ఆమె అతని ప్రైవేట్ పార్ట్స్పై దాడి చేసి ఫెన్సింగ్ దూకి బయటకు పరుగులు తీసింది.
ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితుడు ఆదివారం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ఇందిరానగర్ ప్రాంతంలో సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లుగా గుర్తించిన నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ ఒక్క ఆధారంతో సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు.
కృష్ణానగర్, ఇందిరానగర్ మధ్యలో గది అద్దెకు తీసుకొని ఉంటున్న కె.బాబు సినీ పరిశ్రమలో లైట్మెన్గా పని చేస్తున్నట్లుగా తెలిపారు. అతడు దొంగతనానికి రాలేదని, అత్యాచారం చేయడానికే వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. మొత్తానికి నిందితుడు పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.