ఆది, చెన్న కేశవరెడ్డి, దిల్, ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వి.వి.వినాయక్. ఈ మధ్య వినాయక్ డైరెక్షన్ లో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏం రాలేదు. ఆ మధ్య విడుదలైన ఖైదీ 150 హిట్ అయినా, ఇంటిల్లిజెంట్ అయినంతగా ఆకట్టుకోలేదు. ఆది వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన వినాయక్ ఆ తరువాత వెంటనే నందమూరి బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమా తీశారు. ఇందులో బాలయ్య డ్యుయల్ రోల్లో అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.
తాజాగా చెన్నకేశవరెడ్డి సినిమా విశేషాలను దర్శకుడు వి.వి.వినాయక్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రొడ్యూసర్ బెల్లకొండ సురేష్ ద్వారా బాలకృష్ణకు కథ చెప్పగానే ఒకే చేశారని, స్టోరీ ఒకే చేసిన ఒక వారంలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టామన్నారు. ఈ సినిమా ద్వారా ఓ పెద్ద హీరోను హ్యాండిల్ చేయగలనని తనకు మంచి పేరు వచ్చిందన్నారు. అయితే తాను బాలకృష్ణను ఓ రేంజ్లో చూపించాలనే ఆలోచనతో కథ మీద ఫోకస్ తగ్గిందేమో అనిపించిందన్నారు.
ఈ సినిమాలో టబు చేసిన క్యారెక్టర్కు మొదట సౌందర్యని అనుకున్నాం. బెంగుళూరుకు వెళ్లి స్టోరీ కూడా చెప్పాం. ఇందులో యంగ్, ఓల్డ్ రెండు పాత్రలు ఉంటాయని చెప్పాం.. కానీ అప్పుడే ఓల్డ్ క్యారెక్టర్లు వద్దు వినయ్ గారు అని సౌందర్య తిరస్కరించారు. నేను అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా సౌందర్యతో నాలుగైదు సినిమాలు చేశా. ఇక ఎవరిని తీసుకుందామని అనుకుంటూ ఉండగా.. టబు గుర్తొచ్చారు. వెంటనే ఆమెను కలిస్తే ఒప్పుకున్నారు. శ్రియను తీసుకోవాలని మేము ముందుగానే అనుకున్నాం.. అని వి.వి.వినాయక్ అప్పటి సినిమా ముచ్చట్లు చెప్పుకొచ్చారు.